ఉపన్యాస గమనికలు (తెలుగు)వారపు వ్యాఖ్యానం

మట్టలాదివారం

మార్చి 29, 2026

పవిత్ర గ్రంథ వాక్యాలు

  • జెకర్యా 9:9-10
  • హెబ్రీ 12:1-11
  • మార్కు 14:3-9

వారపు ముఖ్యాంశం

ఉపోథ్ఘాతం : కలిసి ప్రయాణించడం మట్టలాదివారం మనకు క్రైస్తవ విశ్వాస ప్రయాణాన్ని లోతుగా పరిశీలించడానికి ఒక అవకాశాన్ని అందిస్తుంది. ఈ లెంట్ కాలంలో మన ప్రయాణానికి స్పష్టమైన దిశ మరియు లక్ష్యం ఉందని, అది యేసుతో కలిసి సిలువ వైపు ప్రయాణించడమని మనకు గుర్తు చేస్తుంది. మట్టలాదివారం, సిలువకు మించిన విజయాన్ని, సంపూర్ణతను కలిగిన జీవితాన్ని జీవించటానికి మన ప్రయాణాన్ని ఎక్కడికి ఎలా కొనసాగించాలని అనుకుంటున్నామో దానికి తగ్గట్టు సమయం తీసుకొని, ఆలోచించి, విచారించి, త్వరగా ఒక నిర్ణయానికి వచ్చే ఒక సమయాన్ని స్థితిని ఇచ్చేది కాదు. మట్టలాదివారమనేది, మనం ఎవరి మధ్య నివసిస్తూ, నేర్చుకొంటూ, పనిచేస్తూ, ఆరాదిస్తూ, పొరుగువానిగా ఉండాలని పిలువబడ్డామో ఆ స్థలంలోనే మనముండి, ఎక్కడున్నామో, అక్కడికి ఎలా వచ్చామో, ఈ సమయంలో ఎవరితో ప్రయాణిస్తూ కలిసున్నామో గుర్తించి జీవించాలనే పిలుపునిస్తుంది.

1

వాక్య వ్యాఖ్యానం

జెకర్యా 9:9–10

జెకర్యా ప్రవక్త, హగ్గయితో కలిసి, క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దం చివరి దశకు చెందినవారైయుండి బబులోను చెర అనంతరం ప్రవచించినవారిగానూ, చెరలో ఉన్న ప్రజలు తమ స్వదేశానికి తిరిగి వెళ్లడానికి అనుమతించిన ఆనాటి పర్షియా రాజైన కోరేషు అనూహ్య నిర్ణయాన్ని అంగీకరించినవారిగానూ ఉన్నారు. ఈ ప్రకటన, క్రీస్తుపూర్వం 538 సంవత్సరంలో ప్రకటించబడి, తిరిగొస్తామని ఆశ కోల్పోయిన వారు తమ ఛిన్నాభిన్నమైన జీవితాలను, ధ్వంసమైన ఆలయాన్ని మరియు సమాజంలో ఆధ్యాత్మిక జీవితాన్ని పునఃనిర్మించుకోటానికి ఒక అవకాశం కల్పించింది. ఈ లోతైన గ్రంథంలోవున్న ఎన్నో విశేషాలను మరియు సవాళ్లను పక్కనబెట్టేసి, కేవలం కొన్ని వచనాలను మాత్రమే ముఖ్యమని పరిగణిస్తే, మనం ఈ గ్రంథానికి అన్యాయం చేసినట్లవుతుంది. ముఖ్యంగా మనం పరిశీలిస్తున్న ఈ వాక్యభాగంతో పాటు, జెకర్యా 4:6లో ఉన్న “... జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే; శక్తిచేతనైనను బలముచేతనైననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను" అనే వాక్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.

ఈ దినాన మట్టలాదివార సందర్భంగా, మనం ఒక రాజు "విజయవంతంగానూ జయోత్సాహంతోనూ" పట్టణ ప్రవేశం చేస్తాడనుకుంటుండగా, జెకర్యా (9:9–10) "...నీ రాజు... దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు" అనే మాటలను పరిశీలించినప్పుడు, అవి మనకు బాగా తెలిసినవైనందువల్ల వాటిని సాధారణంగా తీసుకోకుండా, మనలను మళ్లీ తాజాగా ఆశ్చర్యపరిచేవిగానే చూడాలి. ఆయన విజయోత్సవ ప్రయాణం, నిర్లక్ష్యంగా, బలహీనంగా, లేదా నిరాసక్తతతో కూడిన వినయంతో కూడినది కాక, లక్ష్యంతో కూడిన వినయంగా పునఃవ్యాఖ్యానించబడుతుంది. గాడిదపై జయ ప్రయాణం చేసే ఈ రాజు, యుద్ధ అశ్వాలపై అహంకారంగా సవారీ చేసే అధికారులను సవాలు చేస్తున్నాడు. బలం న్యాయమని నమ్మి, యుద్ధ రథాలు మరియు ఆయుధాలను దౌర్జన్యంగా ఉపయోగించే గర్విష్టులైన యోధుల ఆధిపత్యాన్ని ఆయన అధిగమిస్తున్నాడు. ఈ రాజు “సమాధానకర్తయని అన్యజనులకు తెలియజేయును" మరియు ఆయన ఆధిపత్యం “సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతములవరకు” విస్తరించును. మనమీ శాంతి యాత్రలో ఆ రాజును అనుసరిస్తుండగా, హింసను జయించి న్యాయమైన మరియు నిలకడైన శాంతిని స్థాపించే రాజు యొక్క పరివారంలో మనమున్నామని గుర్తెరిగి, ధైర్యంగా ప్రకటించడానికి మరియు అత్యంత ఆనందంతో సంతోషించడానికి మనం పిలవబడ్డామని గమనించాలి.

2

వాక్య వ్యాఖ్యానం

హెబ్రీయులకు 12:1–11

బలులను రద్దు చేసే యాజకత్వంపై అధికంగా దృష్టి పెట్టే, పత్రికలలో ప్రత్యేకమైన పత్రికైన ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలోని ఈ భాగం, ఒక ప్రయాణం అనే అలంకారాన్ని కూడా కలిగి ఉంది. ఇది ఏదో ఒక పందెంగా కాకుండా, "అవమానము" మరియు "పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతటిని" నిర్లక్ష్యపెట్టి "విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు" "మన యెదుట ఉంచబడిన పందెం”ను మనకాన్నా ముందు మనకు మార్గము తెరుచుటకు పరిగెత్తనని వర్ణించబడింది. “సిలువను సహించిన” ఆయనను అనుసరిస్తూ మనం పరుగెత్తవలసిన ఈ పందెం “పోరాటం”తో, బాధతో కూడినదై మనలను నిరుత్సాహపరచగలదు, “అలసటకు” గురిచేయగలదు, మరియు ధైర్యం కోల్పోయే అంచుకు తీసుకెళ్లగలిగినప్పటికీ, “నీతియను సమాధానకారమైన ఫలమును” పొందుటకై, మనం సహనం కలిగుండి, ఈ పందేన్ని కొనసాగించటానికి పిలువబడుతున్నామని గమనించాలి. మనం చేసే ఈ ప్రయాణం "దేవుని సింహాసనము యొక్క కుడి పార్స్యమున ఆశీనుడై" యుండి మనలను ప్రోత్సహిస్తున్న యేసు చూపించిన ఆ మార్గాన్ని మనం అనుసరిస్తున్నామని గుర్తుంచుకొని, అది సుళువైంది కాక వ్యయ ప్రయాసలతో కూడినదని గమనించి ఆ పందెం కొరకు నిత్యము సిద్ధపడుండాలని ఈ మట్టలాదివారం మనకు జ్ఞాపకం చేస్తుంది.

3

వాక్య వ్యాఖ్యానం

మార్కు 14:3–9

ఈ మట్టలాదివారమునకు కేటాయించబడిన సువార్త వాక్యభాగం, సాధారణంగా మనకు బాగా తెలిసిన యెరూషలేమును విడిచి బెతనీయకు వెళ్లడంతో ముగిసే “యెరూషలేము జయ ప్రవేశం” (మార్కు 11:1–11) గురించి కాదు కాని, యేసు బేతనీయకు తిరిగి వచ్చినప్పుడు “కుష్ఠరోగియైన సీమోను” ఇంటి దగ్గర జరిగే సన్నివేశాన్ని గురించి తెలియజేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి — యెరూషలేములో ప్రవేశించినప్పుడు, "సర్వోన్నతమైన స్థలములలో జయము" (మార్కు 11:10) అంటూ అనేకుల జయ ధ్వనులతో గౌరవించబడిన యేసు, ఇప్పుడు తన కాలంలో సమాజంలోని అట్టడుగుననున్న వ్యక్తియైన ఆ సీమోను ఇంటిలో కూర్చొని అతనితో భోజనం చేస్తున్నాడు. అంతేకాకుండా మరో అట్టడుగునున్న వ్యక్తి, పేరు కూడా చెప్పబడని ఒక స్త్రీ ఆయన దగ్గరకు, "మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసికొని వచ్చి, పగులగొట్టి ఆ అత్తరు ఆయన తలమీద పోస్తుంది". ఇది నమ్మశక్యం కాని విషయం — ఆమె ఎవరు? ఎందుకు ఇలా చేసింది? ఎంత విలువైన సంపదను వృథా చేసింది! ఆమెను ఈ బేతనీయలోని ఆ ఇంటికి తీసుకువచ్చిన పరిస్థితిని గురించి మనకు ఎలాంటి వివరాలు లేవు, ఆమెకు స్థానం లేని ఆ ఇంటిలోకి ఆహ్వానం లేకుండానే ఆమె ప్రవేశించింది. అయినప్పటికీ, సువార్త సత్యం తన విస్తారతలో అద్భుతంగా నిలుస్తూ, "సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని" యేసు ద్వారా ప్రకటింపబడింది. ప్రకటించే మరియు ప్రకటింపబడే వారిద్దరూ ఏక సమయంలో కేంద్రంగా నిలిచారు కాని, ఆమెకు ఈ ప్రయాణం ప్రకటనా ప్రయాణంగా నిలిచింది. ఒకరు, తన పేరు గుర్తుంచుకోబడకపోయినా, లిఖించబడకపోయినా, సత్య సాక్ష్యానికి ప్రతిరూపంగా నిలుస్తుంటే, మరొకరు తన భూస్థాపన నిమిత్తం "ముందుగానే" సిద్ధపడి, సిలువ మరణమనే నిజమైన ప్రయాణాన్ని గురించిన ప్రతిరూపంగా నిలుస్తున్నాడు. అంటే, ఈ ప్రయాణం విఫలమై నాశనానికి దారి తీస్తుందా?

ముగింపు: ప్రయాణాన్ని కొనసాగిద్దాం

ఆ స్త్రీ చేసిన కార్యాన్ని ప్రశ్నించే వారితో కలిసి; కేకలు వేస్తున్న వారితో కలిసి; మనతో సంభాషణ చేయటానికి ఇష్టపడని వారితో కలిసి ప్రయాణిద్దాం; మనం మౌనంగా ఉండాలని చెప్పేవారితో సంభాషిద్దాం ; వాక్యధ్యానం మరియు ప్రార్థన తర్వాత కూడా హింసకు పాల్పడేవారితో సంభాషిద్దాం; మనము మౌనంగా ఉంటే రాళ్లే మాట్లాడతాయని గుర్తుంచుకుందాం; కార్చబడిన రక్తం నేల నుండే కేకలు వేస్తుందని జ్ఞాపకం చేసుకుందాం. ప్రయాణాల గురించి మాట్లాడుకుంటే — సమీపం నుంచి చేసే ప్రయాణాలు, దూరం నుంచి చేసే ప్రయాణాలు, మనలను ఇంటికి తీసుకువచ్చే ప్రయాణాలు, మనలను దూరంగా తీసుకెళ్లే ప్రయాణాలు; మనకు పరిచయమైన సంఘాల మరియు విశ్వాస సమాజాల దగ్గరకు చేర్చిన ప్రయాణాలు; అదే సంఘాల నుంచి మనలను దూరం చేసే ప్రయాణాలు, మనకు ఇష్టమైన వారితో చేసే ప్రయాణాలు; మనం దూరంగా ఉండాలని భావించే వారితో చేసే ప్రయాణాలు — అన్వేషణతో, ఆశ్చర్యంతో కూడిన ప్రయాణాలు; నేర్చుకునే, మరచిపోయే ప్రయాణాలు; దేవునికి చేరువ చేసే ప్రయాణాలు; యెరూషలేముకు చేర్చే ప్రయాణాలు; సిలువ చెంతకు చేర్చే ప్రయాణాలు, అన్నింటిని గుర్తు చేసుకుందాం. మన భారాలను సిలువ పాదాల వద్ద ఉంచే ప్రయాణాలు, ముళ్లతో చేసిన కిరీటాన్ని ధరించిన మనిషి వైపు వీక్షించే ప్రయాణాలు; ఉచితంగా అందించబడ్డ, స్వేచ్ఛగా ఇవ్వబడ్డ, నీకోసం, నాకోసం, మరియు ఆయన జీవించి మరణించిన ప్రపంచం కోసం సమర్పించిన ఆయన శరీర రక్తాలను కనుగొనే ప్రయాణాలను మనం కొనసాగిద్దాం.

🙏

ముగింపు ప్రార్థన

ప్రార్థన: విశ్వాస ప్రయాణానికి, భవిష్యత్తులోకి నడిపించే ప్రయాణానికి, మాకు తెలియకపోయినా నీకు తెలిసిన ప్రయాణానికి మేము కట్టుబడుండునట్లు ఓ ప్రభువా, మా దేవ; ఆర్భాట, ప్రతిష్ఠ, అధికారాల వెంబడి పరుగెత్తే జీవితం నుండి మమ్మల్ని మళ్ళించి, నిజమైన శిష్యత్వ విధానాన్ని అవలంబించటానికి నీవు మమ్మల్ని పిలుస్తున్న పిలుపుకు లోబడే మనస్తత్త్వాన్ని అనుగ్రహించుము. ఆమెన్.

✍️

వ్యాఖ్యాన రచయిత

జె. జయకిరణ్ సెబాస్టియన్ గారు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు చెందిన కాపరి. వీరు ప్రస్తుతం అమెరికాలోని గెట్టీస్‌బర్గ్ మరియు ఫిలడెల్ఫియాలో ఉన్న యునైటెడ్ లూథరన్ సెమినరీలోని హెచ్. జార్జ్ ఆండర్సన్ చైర్ మరియు మిషన్ అండ్ కల్చర్స్ నందు ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. అనువాదం : రెవ. సుమంత్ సుధ నెమలికంటి