ఉపన్యాస గమనికలు (తెలుగు)వారపు వ్యాఖ్యానం

సెక్సాగెసిమ ఆదివారం

ఫిబ్రవరి 8, 2026

పవిత్ర గ్రంథ వాక్యాలు

  • యెషయా 55:10–13
  • 2 తిమోతికి 3:10–17
  • మార్కు 4:26–32

వారపు ముఖ్యాంశం

ఈ సెక్సాగెసిమ ఆదివారం, దేవుని వాక్యపు శక్తిపై మరియు దాన్ని స్వీకరించడానికి మనుష్య హృదయం సిద్ధంగా ఉండాల్సిన అవసరంపై మన దృష్టి కేంద్రీకృతం చేస్తుంది. పాత నిబంధన వాక్యభాగమైన యెషయా 55:10–13, దేవుని వాక్యం జీవాన్ని, పునరుద్ధరణను, సమృద్ధిమైన ఆశీర్వాదాన్ని తీసుకువస్తుందని తెలియజేస్తుంది. పత్రిక వాక్యభాగమైన 2 తిమోతికి 3:10–17, విశ్వాసపూరిత జీవనానికి మనలను ఎలా సన్నద్ధం చేసి అది ఒకనికి ఆకారమిస్తుందో వివరిస్తుంది. సువార్త వాక్యభాగమైన మార్కు 4:26–32లోని విత్తన ఉపమానం, దేవుని రాజ్యం చిన్న ఆరంభాల నుండి నిశ్శబ్దంగా ఎదుగుతూనే ఏ విధంగా శక్తివంతమైన సంపూర్ణ పంటగా పెరుగుతుందో చూపిస్తుంది. ఈ వాక్యభాగాలు, దేవుని కనబడని కార్యాన్ని విశ్వసించమని, మన హృదయాలను సారవంతమైన నేలగా సిద్ధం చేసుకోవమని, ఉపవాసకాలం వైపు ప్రయాణిస్తుండగా మనలను ఆహ్వానిస్తున్నాయి.

1

వాక్య వ్యాఖ్యానం

యెషయా 55:10–13

యెషయా గ్రంథంలోని ఈ భాగం (యెషయా 40–55), సాధారణంగా ద్వితీయ యెషయా అని పిలువబడే భాగానికి చెందింది. ఇది క్రీ.పూ. 6వ శతాబ్దంలో బబులోను చెరలో ఉన్న కాల నేపథ్యాన్ని కలిగి ఉంది. యూదా దేశం ఓడిపోయి, యెరూషలేము మరియు మందిరం ధ్వంసమై, అనేకమంది బబులోనులో నివసిస్తూ, తమ దేశం నుండి దూరమై, నిరుత్సాహంతో, క్రమంగా పరదేశ సంస్కృతిలో స్థిరపడుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ప్రవక్త ఆదరణ, నిరీక్షణ, పునరుద్ధరణతో కూడిన వాగ్దానాన్ని ప్రకటించాడు.

ప్రవక్త ప్రకృతి యొక్క నియమిత చక్రాన్ని – వర్షం మరియు మంచు భూమిని తడిపి జీవాన్ని కలిగించడమనే వాటిని – దేవుని వాక్యపు లక్ష్యబద్ధమైన, ప్రభావవంతమైన కార్యాన్ని వివరించడానికి ఉపయోగిస్తున్నాడు. వర్షం భూమిని పోషించి, విత్తనాన్ని మరియు ఆహారాన్ని అందించకుండా ఆకాశానికి తిరిగి వెళ్లని విధంగా, దేవుడు పలికిన వాక్యం కూడా ఆయన ఉద్దేశించినదాన్ని తప్పకుండా నెరవేర్చుతుంది ( 10–11) అనిక్కడ తెలియజేయబడింది. 12వ వచనం ఈ ప్రభావవంతమైన వాక్య ఫలితాన్ని చూపిస్తుంది: క్షమించబడిన, పునరుద్ధరించబడిన ప్రజలు ఆనందంతో బయలుదేరి, శాంతితో నడిపించబడతారని తెలుపుతుంది. ఇది చెర నుండి తిరిగివచ్చే అనుభవాన్ని మాత్రమే కాదు, లోతైన రక్షణ అనుభవాన్ని కూడా సూచిస్తుంది. సృష్టి అంతా ఈ విమోచన కార్యంలో భాగస్వామిగా మారుతుందని తెకీయజేయటానికి; కొండలు, గుట్టలు పాడుతున్నట్లుగా, చెట్లు చప్పట్లు కొడుతున్నట్లుగా వర్ణించబడింది. 13వ వచనం, "ముండ్లచెట్లకు బదులుగా దేవదారువృక్షములు మొలుచును దురదగొండిచెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదుగును..." అని చెప్పటం ద్వారా భూమి యొక్క పునరుద్ధరణ దృశ్యాన్ని పూర్తిచేస్తుంది. ఇది శాపానికి ప్రతిఘటనగానూ, పునరుద్ధరణగానూ, శాశ్వత ఆశీర్వాదానికి సంకేతంగానూ ఉంది. మొత్తం మీద, ఈ భాగం దేవుని వాక్యం పశ్చాత్తాపాన్ని, పునరుద్ధరణను, కొత్త జీవాన్ని శక్తివంతంగా తీసుకువస్తుందని, ఫలితంగా ఆనందం, ఫలప్రదత, దేవుని నామ మహిమ కలుగుతుందని బోధిస్తుంది.

యెషయా 55:10–13 మనకు నేడు ఏమి గుర్తుచేస్తుందంటే: తక్షణ ఫలితాలు కనిపించకపోయినా, దేవుని వాక్యం నెరవేరుతుందని తెలుపుతుంది. నేలను నిశ్శబ్దంగా ఫలవంతం చేసే వర్షంలా, వాక్యం మనలో అంతర్గత పునరుద్ధరణను కలిగిస్తూ, వ్యర్థమైన మార్గాల నుండి మనలను మళ్లించి, శాశ్వతమైన ఆత్మీయ ఫలాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆందోళనతో, వేగంగా సాగే జీవితం మధ్య, ఈ వాక్యం దేవుని స్థిరమైన కార్యంపై విశ్వాసం, పశ్చాత్తాపం, సహనంతో కూడిన విశ్వాసపూర్ణతకు పిలుపునిస్తుంది. ఆనందం, శాంతి, పునరుద్ధరణ వాగ్దానం, దేవుడు మన జీవితాలను మాత్రమే కాదు, లోకాన్ని కూడా పునరుద్ధరిస్తున్నాడని, ఆయన ఉద్దేశాలు ఆయన మహిమ కోసం తప్పకుండా నెరవేరుతాయని భరోసా ఇస్తుంది.

2

వాక్య వ్యాఖ్యానం

తిమోతికి 3:10–17

ఈ వాక్యభాగం పౌలు సేవా జీవితంలోని తరువాతి దశను ప్రతిబింబిస్తుంది. ఆ సమయంలో తప్పుడు బోధకులు సంఘాన్ని కలవరపరుస్తుండగా, విశ్వాసపూర్ణులు పెరుగుతున్న వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. లుస్త్రా పట్టణానికి చెందిన యువ నాయకుడైన తిమోతి, మోసం, నైతిక పతనం, హింస సాధారణంగా ఉన్న సందర్భంలో సేవ చేశాడు. పౌలు బోధన, ప్రవర్తన, విశ్వాసం, ప్రేమ, సహనం, హింసలు, బాధలను – ముఖ్యంగా గలతియ పట్టణాల్లో ఎదురైన తీవ్ర వ్యతిరేకతను – తిమోతి దగ్గరగా చూశాడు. 10–11వ వచనాల్లో, పౌలు ఈ సంయుక్త చరిత్రను తిమోతికి గుర్తు చేస్తాడు. “నా ఉద్దేశం” (గ్రీకు: ప్రో తీసిస్) అని సాధారణంగా పౌలు లేఖలలో కనిపించే మాట దేవుని ఉద్దేశాన్ని సూచిస్తుంది, ఇది పౌలు జీవిత పరిచర్య యొక్క గంభీరతను తెలియజేస్తుంది. “విశ్వాసం” (పిస్టిస్) ఇక్కడ విశ్వాసపూర్ణత్వాన్ని కూడా సూచించవచ్చు, అంటే “సహనం” అంటే ప్రత్యర్థుల పట్ల దీర్ఘసహనం. “ప్రేమ” (అగాపే) అంటే, దేవుని నుండి ఆకారమొందిన స్థిరమైన, త్యాగపూరిత ప్రేమ. “స్థైర్యం” (హైపోమోనే) అంటే కష్టాలు, అడ్డంకుల మధ్య ధైర్యంగా నిలబడటం. ఇట్లాంటి క్రైస్తవ విశ్వాసాన్ని పౌలు నిబద్ధతగా చూపించాడు.

పౌలు పిసిదియా, అంతియొకియా, ఐకోనియ, లుస్త్రాలలో ఎదురైన హింసలను గుర్తుచేస్తాడు (అపో.కార్య. 13–14). లుస్త్రాలో ఆయన రాళ్లతో కొట్టబడి మృతుడని వదిలివేయబడ్డాడు. లుస్త్రాకు చెందిన తిమోతి, ఆ కాలంలోనే విశ్వాసిగా మారి ఉండవచ్చు; కాబట్టి ఈ సంఘటనలు అతనికి స్పష్టంగా గుర్తుండేవి. అయినప్పటికీ, ప్రభువు పౌలును ఈ అన్ని కష్టాల నుండి విడిపించాడు. క్రైస్తవ పరిచర్య ఖరీదైన విశ్వాసపూర్ణతను కోరుకుంటుందని ఈ భాగం చూపిస్తుంది.

ఈ లేఖ ఉద్దేశం కాపరితత్వ మరియు స్థిరీకరణాత్మకమైనది. పౌలు తన జీవితాన్నే ఉదాహరణగా చూపిస్తూ, సత్యం కేవలం ఆలోచన మాత్రమే కాకుండా, బాధల మధ్య నిలిచే స్వభావం మరియు స్థైర్యంలో జీవించబడే వాస్తవమని తెలియజేస్తాడు. అలాగే, తిమోతి పత్రికలో దృఢంగా దాన్ని స్థిరపరుస్తాడు. చిన్ననాటి నుండే, తన అమ్మమ్మ లోయి మరియు తల్లి యూనికే ద్వారా యూదా గ్రంథాలను తిమోతి నేర్చుకున్నాడు. చిన్న పిల్లలకు ధర్మశాస్త్రాన్ని నేర్పడం, కంఠస్థం చేయించడం యూదా సంప్రదాయం. ఇది తిమోతి యొక్క ఆధ్యాత్మిక వారసత్వం. “పవిత్ర గ్రంథాలు” అనే పదం, ఫిలో, జోసెఫస్ వంటి రచయితలు ఉపయోగించిన విధంగా, పాత నిబంధనను సూచిస్తుంది. ఈ గ్రంథాలు, క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారా రక్షణకు దారితీసే జ్ఞానాన్ని అందించగలవు. ఈ భాగం, పిల్లలు మరియు యువతలో విశ్వాసాన్ని పెంపొందించడంలో కుటుంబాలు మరియు సంఘాల పాత్రకు నేడు కూడా ప్రోత్సహాన్నిస్తుంది.

పౌలు, ఈ పత్రిక యొక్క దైవ మూలాన్ని (“దేవుని శ్వాసతో పుట్టినది”) మరియు దాని ప్రయోజనాత్మక సమృద్ధిని ధృవీకరిస్తాడు. పత్రిక ఉద్దేశం: సత్యాన్ని బోధించడం, తప్పును బట్టబయలు చేయడం, తప్పిపోయినదాన్ని సరిచేయడం, నీతిలో శిక్షణ ఇవ్వడం. మొత్తంగా, సిద్ధాంత గందరగోళం మరియు సాంస్కృతిక ఒత్తిడుల మధ్య, దేవుని సేవకుడు సంపూర్ణంగా తయారై, ప్రతి మంచి కార్యానికి సిద్ధంగా ఉండాలని పౌలు దీని ద్వారా కోరుతున్నాడు.

ఈ పత్రిక జీవాన్ని, సరిదిద్దడాన్ని, పునరుద్ధరణను ఇవ్వడానికి ఉద్దేశించబడిందే కాని; నియంత్రించడానికి, అవమానించడానికి, లేదా ఇతరులను అణచివేయడానికి మాత్రం కాదు. ఇతరులను మాట్లాడకుండాజేయడానికి, తొలగించడానికి, కఠినత్వాన్ని న్యాయీకరించడానికి బైబిల్‌ను ఉపయోగించినప్పుడు, అది దీనిలోని పౌలు ఉద్దేశానికి విరుద్ధంగా వాడినట్లే. పౌలు, వాక్యం మనలను నీతిలో శిక్షణ ఇస్తుంది; ఆ నీతి ఎల్లప్పుడూ క్రీస్తువలె ప్రేమ, వినయం, కరుణతో ఆకారమొందుతుంది, గర్వం లేదా బలవంతంతో కాదని చెప్తున్నాడు. వాక్యం బాగా తెలిసినా, కరుణ లేకుండా వాడినవారిని యేసు ఎదిరించాడు. అందువల్ల, అంతులేని స్వరాలు మరియు ఆన్‌లైన్ ప్రభావాలు ఉన్న యుగంలో, వాక్యంలో నాటుకుపోయి ఉండటం అత్యంత ప్రాయోగికమైన పిలుపు. దేవుని వాక్యంతో క్రమమైన సంబంధం, సత్యాన్ని గ్రహించడానికి, తప్పు దృక్పథాలను సరిదిద్దుకోవడానికి, భావోద్వేగ మరియు ఆత్మీయ ఆరోగ్యంతో ఎదగడానికి సహాయపడుతుంది.

3

వాక్య వ్యాఖ్యానం

మార్కు 4:26–32

ఈ బోధ, యేసు గలిలయ సేవలో భాగం. ఆ కాలంలో ఆయన ఉద్యమం చిన్నదిగా, సున్నితంగా, తరచూ అపార్థం చేయబడినదిగా కనిపించింది. గ్రామీణ, వ్యవసాయ సంస్కృతిలో, వ్యవసాయ విధానాలు రోజువారీ జీవితాలను ఆకారమిచ్చేవి. రాజకీయంగా, అనేకమంది యూదులు దేవుని రాజ్యం ఒక నాటకీయ జాతీయ పునరుద్ధరణగా వస్తుందని ఆశించారు; కానీ యేసు ఆ అంచనాలను సవాలు చేసే విధంగా రాజ్యం గురించి బోధించాడు. మార్కుకు మాత్రమే ప్రత్యేకమైన “పెరుగుతున్న విత్తనం” ఉపమానం, రాజ్యపు వృద్ధి రహస్యమయమైనదని, దేవుని చేత నడిపించబడేదని నొక్కి చెబుతుంది. రైతు విత్తనాన్ని చల్లి, నిద్రపోతూ లేస్తూ ఉండగా, విత్తనం ఎలా మొలకెత్తుతుందో అతనికి తెలియని విధంగా జీవం, పెరుగుదల దేవుని శక్తి నుండే వస్తాయని ఇది సూచిస్తుంది. “మొలక, వెన్ను, ముదురు గింజ” వంటి దశలు, క్రమమైన, సహజమైన ఎదుగుదలను చూపిస్తాయి; పంట కోత భవిష్యత్ పరిపూర్ణతను సూచిస్తుంది. ఆవాల గింజ ఉపమానం కూడా ఇదే భావాన్ని బలపరుస్తుంది: అతి చిన్న విత్తనం పెద్ద చెట్టుగా మారి ఆశ్రయం ఇస్తుందని ఆ ఉపమానం చెప్తుంది. ఈ ఉపమానాలు, చిన్నదిగా కనిపించడం వైఫల్యం కాదని శిష్యులను ధైర్యపరుస్తాయి. దేవుని రాజ్యం నిశ్శబ్దంగానే కానీ ఖచ్చితంగా, దాగిన ఆరంభాల నుండి కనిపించే సంపూర్ణత వైపు ముందుకు సాగుతుంది. ఇది ఆందోళనతో ఫలితాలను బలవంతంగా తేవడం కాకుండా, సహనంతో విశ్వాసం ఉంచమని పిలుపునిస్తుంది.

యేసు ఉద్యమం చిన్నదిగా ఉండి, కొందరిలో ఉత్సాహం, మరికొందరిలో తిరస్కారం, శిష్యులలో కూడా గందరగోళాన్ని రేపింది. ఈ దాగినదనం మరియు అప్రాముఖ్యత మధ్య, యేసు గ్రామీణ శ్రోతలకు పరిచయమైన వ్యవసాయ దృశ్యాలను ఉపయోగించాడు. వ్యవసాయం సహనాన్ని, మానవ నియంత్రణకు అతీతమైన ప్రక్రియలపై ఆధారపడటాన్ని, ఆలస్య ఫలితాలను నేర్పుతుంది. విత్తనం నుండి పంట వరకు ఉండే దీర్ఘకాలాన్ని, చిన్న విత్తనం నుండి పెద్ద మొక్కకు ఉండే వ్యత్యాసాన్ని శ్రోతలకు యేసయ్య దీని ద్వారా బాగా అందించాడు. ఆధ్యాత్మికంగా, ప్రజలు రాజకీయ రాజ్యాన్ని ఆశించారు; కానీ యేసు నిశ్శబ్దమైన, సహజమైన ఎదుగుదల గురించి మాట్లాడాడు.

మార్కు 4:26–32, వేగం, కనబడటం, కొలిచే విజయాల పట్ల మోజు ఉన్న లోకంలో బలంగా మాట్లాడుతుంది. నిజాయితీతో చేసే చిన్న పనుల్లో, సహనంతో చేసే సంరక్షణలో, న్యాయమైన శ్రమలో, ప్రార్థనలో, గమనించబడని సేవలో దేవుని కార్యం తరచూ ఉపరితలానికి క్రింద, నిశ్శబ్దంగా పెరుగుతుందని ఈ ఉపమానాలు గుర్తుచేస్తాయి. సంఘాలు చిన్నగా, అంచున పడినట్లుగా, ప్రభావం లేనట్లుగా అనిపించినప్పుడు, యేసు బోధ ఆందోళనకు కాకుండా విశ్వాసానికి పిలుపునిస్తుంది: మన బాధ్యత విశ్వాసపూరితంగా విత్తడం మాత్రమే, ఫలితాలను బలవంతంగా తేవడం కాదు. ఆశ్రయం ఇచ్చే చెట్టు రూపకం, సంఘాలు శరణ్యాలుగా మారాలని సవాలు చేస్తుంది – బలహీనులను, ఒత్తిడిలో ఉన్నవారిని, తొలగించబడినవారిని ఆహ్వానించే సమాజాలుగా ఉండమనే పిలుపునిస్తుంది. . చివరికి, ఈ ఉపమానాలు ధృఢమైన ఆశను పెంపొందిస్తాయి: సంఘర్షణ, అన్యాయం, అనిశ్చితి మధ్య రాజ్యం దాగి ఉన్నట్లు కనిపించినా, దేవుడు మనకు కనిపించేదానికంటే గొప్ప భవిష్య పంటను సిద్ధం చేస్తూ కార్యం చేస్తున్నాడనే నిరీక్షణనిస్తాయి.

🙏

ముగింపు ప్రార్థన

వాక్యంగా మా దగ్గరకు వచ్చిన దేవా, నీ సత్యాన్ని మా ఆలోచనల్లో మాత్రమే కాకుండా, మా అలవాట్లలో, మాటల్లో, ఎంపికల్లో లోతుగా నాటుము. వాక్యాన్ని p ఇతరులను తీర్పు చెప్పడానికి, వాదనలు గెలవడానికి, గాయపరచడానికి ఉపయోగించిన చోట మమ్మల్ని క్షమించు; క్రీస్తు మార్గాన్ని మాకు నేర్పు – సత్యంలో దృఢంగా, ప్రేమలో సౌమ్యంగా. నిజాయితీగా, శ్రద్ధగా, బలంగా సేవ చేయడానికి సిద్ధమైన జీవితాలుగా మమ్మల్ని తీర్చిదిద్దు, తద్వారా సమాజాలు న్యాయం, ఆనందం, శాంతిలో ఎదగగలగునట్లు చేయుమని యేసు నామంలో ప్రార్ధిస్తున్నాము. ఆమెన్.

✍️

వ్యాఖ్యాన రచయిత

డా. లాల్మువాన్‌పుయి, మిజోరం ప్రెస్బిటీరియన్ చర్చ్ సభ్యురాలు, కోల్కతాలోని బిషప్‌స్ కాలేజ్ మరియు NIIPGTSలో నూతన నిబంధన బోధిస్తున్నారు. అనువాదం: రెవ. సుమంత్ సుధ నెమలికంటి.