ఉపన్యాస గమనికలు (తెలుగు)వారపు వ్యాఖ్యానం

telugu

2025-12-10

పవిత్ర గ్రంథ వాక్యాలు

  • James 1:2–4
  • Psalm 23:1–6

వారపు ముఖ్యాంశం

ఓడిపోయిన మరియు మానసికంగా దెబ్బతిన్న సముదాయాల పట్ల దేవుడు విశ్వాస్యుడిగా ఉంటాడు. సామ్రాజ్యాల నడుమ కూడా దేవుడు నాయకులను, నిరీక్షణను లేవనెత్తి, నిశ్శబ్దంగా చరిత్రను మార్చే "ఆ దినములు" చేరువ చేస్తాడు.

1

వాక్య వ్యాఖ్యానం

యిర్మియా 33:14-18

“ఆ దినములు రానున్నవి,” అని యిర్మియా ఐదు వచనాలలో మూడుసార్లు ప్రవచించాడు. యిర్మియా “ఆ దినములు” వస్తున్నాయని ఏ కాలంలో లేదా ఆ దినములు ఏ సందర్భంలో ప్రత్యక్షమవుతాయని ప్రవచించాడు? యిర్మియా యూదాలో రాజకీయ కల్లోలంతో నిండిన నలభై సంవత్సరాల కాలంలో—క్రీపూ 627 నుండి 586 వరకు—ప్రవచించాడు. ఆ నాలుగు దశాబ్దాల్లో అయిదుగురు రాజులు ఎదిగి పతనమవ్వటం ఆయన చూశాడు. వారిలో ఒకరు సంవత్సరం కూడా పాలించలేదు. రాజకీయ అస్థిరత చుట్టుపక్కలున్న చల్దీయులకు అవకాశమై, వారు దక్షిణాది రాజ్యమైన యూదా రాజ్యంపై కుట్రలు పన్ని, కొంచెం కొంచెంగా రాజ్యాన్ని ఆక్రమించి, నాయకులను చెరపట్టటానికి అవకాశమిచ్చింది. సిద్కియా రాజ్యపాలనలో (క్రీపూ 597–586) నెమ్మది నెమ్మదిగా జరిగిన ఈ ఆక్రమణ యెరూషలేము మరియు దావీదు వంశ చెరపట్టబడటంతో పరాకాష్టకు చేరింది. ఈ నాలుగు దశాబ్దాలు, పాలకులు ధనికులతో చేసుకున్న అవినీతి కూటమిని కూడా చవిచూసింది. యెహోవా దేవుడు తిరుగులేని నిబంధన చేసిన పేదల పక్షంగా ఉండి వారిని రక్షించాల్సిన రాజులు, ధనికులకు మద్దతు ఇచ్చి పేదలను అణగదొక్కారు. అన్యాయాలను ఖండించాల్సిన ప్రవక్తలు దుష్టతను సమర్థించారు. యాజకులు వారు సమర్పించాల్సిన బలులు, కానుకలను సిగ్గులేకుండా దోచుకున్నారు. యెహోవాపై నమ్మకం ఉంచాల్సిన దావీదు వంశ రాజులు; ఆయుధాలు, సైన్యాలు, సరిహద్దుల ఆవలున్న రాజకీయ మిత్రులను నమ్మారు. “దావీదు చిగురు” యెహోవా దేవునితో చేసుకున్న నిబంధనలో విఫలమైంది. జీవానికి సంబంధించిన ఆచూకీ లేకుండా పోయింది.

33వ అధ్యాయానికొచ్చేసరికి యిర్మియా చల్దీయుల చెరలో ఉన్నట్లు గమనించగలం. మొదటి 29 అధ్యాయాలలో ఈ ఉగ్ర ప్రవక్త రాబోయే యెహోవా ఉగ్రతను గురించి ప్రకటించాడు. యెరూషలేము పతనం మరియు ప్రముఖులు చెరపట్టబడటం యెహోవా శిక్షగా ఆయన వ్యాఖ్యానించాడు. పతనం తర్వాత యిర్మియా విలాపవాక్యముల గ్రంధంలో విలపిస్తాడు కానీ అది నిరాశలో కాదని గమనించాలి. తనూ, యూదా నాయకులూ చెరపట్టబడటంతో, యిర్మియా తన పంథాను మార్చుకున్నాడు. యెహోవా స్థిరమైన ప్రేమను ఆయన స్మరించుకొంటూ నిరీక్షణనందించాడు. ఈ నిరీక్షణ దావీదు విశ్వసనీయతను బట్టి కాక, బాధితుల పట్ల దేవుని అచంచలమైన ప్రేమపై మాత్రమే ఆధారపడుందని గమనించాలి. ఒకప్పుడు ప్రజలుగా ఎంచబడని దేవుని ప్రజలతో, కేవలం దేవుడు చేసిన నిబంధన మేరకు అవిశ్వాసులైన దావీదు వంశంలోనుంచి కూడా దేవుడు తన విశ్వాస్యతనుబట్టి అధిపతిని లేవనెత్తగలడు. చెరలోనున్న వారిని నిరీక్షణ కోల్పోవద్దని ప్రవక్త ప్రోత్సహించాడు. ఓడిపోయిన సముదాయాల పట్ల దేవుని విశ్వసనీయత, పూర్తిగా పాడైన వంశంలోనుంచి కూడా హింస, దుష్టతకు మారుపేరుగా మారిన పట్టణాల్లో సైతం నీతిన్యాయాలతో కూడిన పరిపాలననందించటానికి నాయకులను లేవనెత్తగల శక్తి దేవునికుందనే అంశాలపై ఈ వాక్యభాగం మీద బోధించేవారు దృష్టి పెట్టవచ్చు.

2

వాక్య వ్యాఖ్యానం

కొలస్సి 1:12–23

నాలుగు అధ్యాయాలతో కూడిన ఈ సంక్షిప్త పత్రికలో రచయిత విశ్వాసుల దృష్టిని క్రీస్తు వైపు మళ్లిస్తాడు. చాలా మంది పండితులు ఈ పత్రికను 60వ దశక ఆరంభంలో వ్రాసుండొచ్చని భావిస్తున్నారు. ఇది కొలస్సిలోని క్రైస్తవులకు రాయబడినదై, చుట్టుపక్కల ప్రాంతాల్లోని సంఘాల్లో కూడా వ్యాపించి ఉండవచ్చు. ఆ కాలంలోని రాజకీయ పరిస్థితులను మీరు గుర్తుచేసుకోటానికి ప్రయత్నించొచ్చు. తన యౌవ్వనకాలంలోనే సింహాసనారోహణ చేసిన నీరో, క్రీ.శ. 60 నాటికి సంపూర్ణ అధికారాన్ని కేంద్రీకరించుకున్నాడు. అధికార వ్యవస్థలు కూలిపోయి ఉన్మాదం రాజ్యమేలింది. యూదులను, క్రైస్తవులను దేశద్రోహులని అనుమానిస్తూ, వారిపై ముఖ్యంగా రోమా నగరంలోని వారిపై భయంకరమైన హింసను ప్రదర్శించాడు. ఇదే సమయంలో కొలస్సి, లవొదకియ, హియెరాపొలి పట్టణాలను భూకంపం కుదిపేసింది. నేటి టర్కీలో ఉన్న కొలస్సి, నూలు వ్యాపారానికి ప్రముఖ కేంద్రం; ఆ పరిశ్రమ చౌక బానిస కార్మికులపై నడిచేది. కొత్త నిబంధనలో అలాంటి బానిస యజమానుల్లో ఒకడైన ఫిలేమోనును మనం చూస్తాము. కైసరు మరియు బానిస యజమానుల మరియు విశ్వశక్తుల నిరంతర ఒత్తిడుల మధ్య, అంతేకాక నిత్యం సంస్థనాలు మరియు అధికారుల ద్వారా దృశ్య–అదృశ్యంగా కలిగే భయాల మధ్య కొలస్సిలోని క్రైస్తవులు జీవించారు. వారు రాజాధిరాజైన క్రీస్తును—సిలువేయబడిన ప్రభువును మరిచి, ఓటమి మరియు మరణం ద్వారా వచ్చే అపకీర్తిని గురించి ఎక్కువగా ఆలోచించసాగారు. ఈ పత్రిక రచయిత మొదటి అధ్యాయం తొలి మూడు వచనాల్లో శుభాకాంక్షలు తెలియజేసి, తరువాతి వచనాల్లో కొలస్సిలోని క్రైస్తవుల కొరకు ప్రార్థన చేస్తాడు. వారి నిరీక్షణ, విశ్వాస, ప్రేమలను ఆయన ప్రశంసించాడు. మనము చదువుతున్న ఈ వాక్యభాగంలో రచయిత, సిలువేయబడిన క్రీస్తు యొక్క విశ్వవ్యాప్త విసిష్టతను గురించి తెలియజేస్తాడు. 15 నుండి 17వ వచనాలు, సృష్టిలో క్రీస్తు యొక్క ప్రాధాన్యత మరియు కేంద్రీయతను గురించి సూచిస్తాయి. క్రీస్తు పాలకుడు అని చెప్తాయి. కొలస్సిలోని గాయపడ్డ క్రైస్తవులు భయపడ్డ సింహాసనాలు, అధికారాలు, పరిపాలకులు మరియు శక్తులు, ఏవీ కూడా దుర్భలమైన వాని ముందు నిలబడలేవు. 15వ వచనంలో దేవుని స్వరూపం గురించి తెలిపిన భావన, సృష్టి వృత్తాంతాలలోని ఆదికాండము మొదటి రెండు అధ్యాయాలలో కనిపించే దైవ స్వరూప ప్రతిరూప భావనకూ, ఇంకా ఎక్కువగా సామెతలు 8వ అధ్యాయంలో ఉన్న జ్ఞానానికి సంబంధించిన సూచనలై ఉండొచ్చు.

సంఘానికి శిరస్సు సిలువేయబడిన క్రీస్తే కానీ అజేయులైన చక్రవర్తులు కాదు. క్రీస్తు రిక్తత్వంలో దైవ సంపూర్ణత వసిస్తుంది. గాయపడ్డ క్రీస్తు శరీరమే ఓడిపోయిన, అవమానించబడిన కొలస్సియులకు ధైర్యం, సమాధానం ఇచ్చే ఆధారం. వారి లేమిలో దేవుని పరిపూర్ణత వసిస్తుంది. వారి శారీరక ఓటముల్లో, మరణాల్లో దేవుని జీవం వ్యక్తమవుతుంది. వారి కష్టాలు, బాధలే నిజమైన (పాక్స్ రొమానా) రోమా సమాధానాన్ని స్థాపిస్తాయి కానీ, సామ్రాజ్య సైన్యాలు కాదు. సిలువ వేయబడిన సర్వాధికారి యొక్క దర్శనం, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బాధితునిగా ఉండి రాజ్యాన్ని స్వీకరించిన వానితోను, ప్రకటన గ్రంథంలో సాక్షిగా మరణించి సింహాసనారోహణ పొందిన వానితోను సారూప్యంగా నినదిస్తుంది. ఈ వాక్యభాగం ఆధారంగా భోధించే భోధకులు, ఈ వచనంలో పరాజితులై గాయపడి మానసికంగా దెబ్బతిన్న సమాజాలతో చేసుకున్న తన నిబంధన పట్ల దేవుని విశ్వాస్యతపై మళ్లీ దృష్టి కేంద్రీకరించవచ్చు మరియు అన్యాయంగా శిక్షించబడిన దేవుని ప్రజలకు దేవుడు న్యాయమందించి గౌరవించబోతోన్న ఆ దినాలపై సంఘపు దృష్టిని మళ్లించవచ్చు.

🙏

ముగింపు ప్రార్థన

.కరుణగల దేవా, “ప్రజలు కానివారిని” నీ ప్రజలుగా పిలిచినందుకు నీకు కృతజ్ఞతలు. ఎవరూ పట్టించుకోని వంశంలో పుట్టిన వారిని నీ ప్రజలకు నాయకులుగా నియమించినందుకు నీకు కృతజ్ఞతలు. మా నిరంతర అవిశ్వాసానికి మధ్యలో కూడా, మాలో కనిష్ఠులైనవారి పట్ల నీ విశ్వాస్యతకు కృతజ్ఞతలు. ప్రతి ఆడ్వంట్లో, చిన్నవైనా విశేషమైన రీతిలో నీ అద్భుతాలతో మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూ ఉండమని ప్రార్ధిస్తున్నాము! ఆమెన్.

✍️

వ్యాఖ్యాన రచయిత

సామర్లకోట, ఆంధ్రప్రదేశ్కు చెందిన రెవ. డా. జేమ్స్ తానేటి గారు, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ప్రెస్బిటేరియన్ సంఘంలో వాక్యము మరియు పరిశుద్ధ క్రియల సేవకునిగా నియమితులైయున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా, వర్జీనియా రాష్ట్రం, రిచ్మండ్ నగరంలో ఉన్న యూనియన్ ప్రెస్బిటేరియన్ సెమినరీలో వరల్డ్ క్రిస్టియానిటీ (ప్రపంచ క్రైస్తవ విశ్వాసం) విభాగంలో బోధిస్తున్నారు. అనువాదం: రెవ. సుమంత్ సుధ నెమలికంటి.