వాక్య వ్యాఖ్యానం
యెషయా 55:10–13
యెషయా గ్రంథంలోని ఈ భాగం (యెషయా 40–55), సాధారణంగా ద్వితీయ యెషయా అని పిలువబడే భాగానికి చెందింది. ఇది క్రీ.పూ. 6వ శతాబ్దంలో బబులోను చెరలో ఉన్న కాల నేపథ్యాన్ని కలిగి ఉంది. యూదా దేశం ఓడిపోయి, యెరూషలేము మరియు మందిరం ధ్వంసమై, అనేకమంది బబులోనులో నివసిస్తూ, తమ దేశం నుండి దూరమై, నిరుత్సాహంతో, క్రమంగా పరదేశ సంస్కృతిలో స్థిరపడుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ప్రవక్త ఆదరణ, నిరీక్షణ, పునరుద్ధరణతో కూడిన వాగ్దానాన్ని ప్రకటించాడు.
ప్రవక్త ప్రకృతి యొక్క నియమిత చక్రాన్ని – వర్షం మరియు మంచు భూమిని తడిపి జీవాన్ని కలిగించడమనే వాటిని – దేవుని వాక్యపు లక్ష్యబద్ధమైన, ప్రభావవంతమైన కార్యాన్ని వివరించడానికి ఉపయోగిస్తున్నాడు. వర్షం భూమిని పోషించి, విత్తనాన్ని మరియు ఆహారాన్ని అందించకుండా ఆకాశానికి తిరిగి వెళ్లని విధంగా, దేవుడు పలికిన వాక్యం కూడా ఆయన ఉద్దేశించినదాన్ని తప్పకుండా నెరవేర్చుతుంది ( 10–11) అనిక్కడ తెలియజేయబడింది. 12వ వచనం ఈ ప్రభావవంతమైన వాక్య ఫలితాన్ని చూపిస్తుంది: క్షమించబడిన, పునరుద్ధరించబడిన ప్రజలు ఆనందంతో బయలుదేరి, శాంతితో నడిపించబడతారని తెలుపుతుంది. ఇది చెర నుండి తిరిగివచ్చే అనుభవాన్ని మాత్రమే కాదు, లోతైన రక్షణ అనుభవాన్ని కూడా సూచిస్తుంది. సృష్టి అంతా ఈ విమోచన కార్యంలో భాగస్వామిగా మారుతుందని తెకీయజేయటానికి; కొండలు, గుట్టలు పాడుతున్నట్లుగా, చెట్లు చప్పట్లు కొడుతున్నట్లుగా వర్ణించబడింది. 13వ వచనం, "ముండ్లచెట్లకు బదులుగా దేవదారువృక్షములు మొలుచును దురదగొండిచెట్లకు బదులుగా గొంజివృక్షములు ఎదుగును..." అని చెప్పటం ద్వారా భూమి యొక్క పునరుద్ధరణ దృశ్యాన్ని పూర్తిచేస్తుంది. ఇది శాపానికి ప్రతిఘటనగానూ, పునరుద్ధరణగానూ, శాశ్వత ఆశీర్వాదానికి సంకేతంగానూ ఉంది. మొత్తం మీద, ఈ భాగం దేవుని వాక్యం పశ్చాత్తాపాన్ని, పునరుద్ధరణను, కొత్త జీవాన్ని శక్తివంతంగా తీసుకువస్తుందని, ఫలితంగా ఆనందం, ఫలప్రదత, దేవుని నామ మహిమ కలుగుతుందని బోధిస్తుంది.
యెషయా 55:10–13 మనకు నేడు ఏమి గుర్తుచేస్తుందంటే: తక్షణ ఫలితాలు కనిపించకపోయినా, దేవుని వాక్యం నెరవేరుతుందని తెలుపుతుంది. నేలను నిశ్శబ్దంగా ఫలవంతం చేసే వర్షంలా, వాక్యం మనలో అంతర్గత పునరుద్ధరణను కలిగిస్తూ, వ్యర్థమైన మార్గాల నుండి మనలను మళ్లించి, శాశ్వతమైన ఆత్మీయ ఫలాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆందోళనతో, వేగంగా సాగే జీవితం మధ్య, ఈ వాక్యం దేవుని స్థిరమైన కార్యంపై విశ్వాసం, పశ్చాత్తాపం, సహనంతో కూడిన విశ్వాసపూర్ణతకు పిలుపునిస్తుంది. ఆనందం, శాంతి, పునరుద్ధరణ వాగ్దానం, దేవుడు మన జీవితాలను మాత్రమే కాదు, లోకాన్ని కూడా పునరుద్ధరిస్తున్నాడని, ఆయన ఉద్దేశాలు ఆయన మహిమ కోసం తప్పకుండా నెరవేరుతాయని భరోసా ఇస్తుంది.
