వాక్య వ్యాఖ్యానం
యెషయా 58:6-12: దేవునితో భాగస్వామ్యంగా ప్రార్థన
ఈ వచనాలు, దేవుని పట్ల మరియు మతాచారాల పట్ల ఉండే కొన్ని రకాల అవగాహనలను తీవ్రంగా ఖండిస్తాయి. అటువంటి తప్పుడు అవగాహనలు దేవునితో చేసే పనులను లేదా ఆరాధనలను ఒక వ్యాపార లావాదేవీలా (లాభనష్టాల బేరసారాలలా) మారుస్తాయి. యెషయా గ్రంథం దేవుని ప్రజల పనులు, చెరలో వారు అనుభవించిన బాధలు మరియు వారి పునరుద్ధరణను గూర్చిన సుదీర్ఘ చరిత్రను చెరపట్టబడటానికి ముందు, చెర కాలంలో మరియు చెర తర్వాత వ్రాయబడింది. అంటే, ఈ గ్రంథం ఒకే వ్యక్తి చేత, ఒకే సమయంలో లేదా ఒకే స్థలంలో వ్రాయబడలేదని దీనర్ధం. ఈ గ్రంధం వివిధ భాగాలుగా వ్రాయబడిందని, లేదని భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ, సాధారణంగా ఈ గ్రంథంలోని 1 నుండి 39 అధ్యాయాలు మొదటి భాగంగా, 40 నుండి 55 అధ్యాయాలు రెండవ భాగంగా, మరియు 55 నుండి 66 అధ్యాయాలు మూడవ భాగంగా విభజింపబడిందని ఎక్కువశాతం మంది అంగీకరిస్తారు. ఇవ్వబడ్డ పాఠం 'మూడవ యెషయా' (ట్రిటో-యెషయా) గ్రంథంలో భాగం. ఇది చెరకాలం తర్వాత వచ్చిన రచనల సమాహారం. చెర నుండి యెరూషలేముకు తిరిగి వచ్చిన వారికి దేవుని నుండి లభించిన హెచ్చరికలను మరియు నిరీక్షణను ఈ వచనాలు అందిస్తాయి. ప్రాముఖ్యంగా, ఈ మూడవ యెషయా ప్రవచనాలు 'శరదృతువు పండుగ' కాలంలో వ్రాయబడ్డాయి. 58వ అధ్యాయం వాటిలో ఒకటి. ఇది మతపరమైన వేషధారణపై (కపటత్వంపై) తీవ్రమైన వ్యంగ్యాస్త్రాలు మరియు కఠినమైన పదజాలంతో నిండి ఉంది. యెషయా 3వ వచనంలో ఇలా ప్రకటిస్తున్నాడు: "దేవునికి దగ్గరవ్వడానికి మనం పెట్టుకునే స్వంత నిబంధనలు వ్యర్థం." ఆపై 3బి నుండి 14 వచనాలలో మానవుల వ్యర్థ ప్రయత్నాలను ఎత్తిచూపుతూ; మీలో వినయం లేదు, మీ స్వంత ప్రయోజనాలనే చూసుకుంటున్నారు, పేదలను బాధిస్తున్నారు, వివాదాలు కలహాలు పెట్టుకుంటున్నారు, హింసకు పాల్పడుతూ భక్తి ఉన్నట్టు నటిస్తున్నారు; మీ ఈ ప్రయత్నాలన్నీ హాస్యాస్పదం! అని హెచ్చరిస్తున్నాడు.
ఈ ధోరణికి భిన్నంగా, బందీల విముక్తి ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించటం మరియు పేదల పట్ల కరుణ చూపటం మన విశ్వసనీయతకు సూచికగా మరియు దేవుని సార్వభౌమాధికారాన్ని బలపరిచే సాధనంగా ఉంటుందని యెషయా రూఢిగా ప్రతిపాదించాడు (6-7). ఇలాంటి ప్రతిపాదనలే యేసు నజరేతులోని సమాజ మందిరంలో యెషయా 61:1 నుండి చదవడానికి ఇష్టపడటంలోనూ (లూకా 4:18), మత్తయి 25:31-46 లోని 'అంతిమ తీర్పు' ఉపమానంలోనూ తిరిగి కనిపిస్తాయి. ఈ వచనం ఎన్నో లోతైన ఆలోచనలను అందిస్తున్నప్పటికీ, మన ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వాటిలో రెండింటిని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. మొదటిది, దేవుడు తన మంచితనానికి బదులుగా ప్రజల నుండి ఆశించేది ఏమిటంటే; ఏ రూపంలో ఉన్న అన్యాయ బంధకాలను, అనగా ఆకలిని, నిరాశ్రయతను మరియు పేదరికం యొక్క వివిధ రూపాలను ఎదిరించి పోరాడటం ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే వారి సంకల్పం. రెండవది, ఎవరూ కూడా దేవుని నుండి ప్రతిఫలాలు లేదా ప్రతిస్పందనలు ఆశించి ఆయనతో బంధాన్ని నిర్మించుకోలేరని, కేవలం తన కోసం మరియు ఈ ప్రపంచం కోసం దేవుడు కలిగియున్న ఉద్దేశాలతో తమను తాము విలీనం చేసుకోడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందనే విషయం. యెషయా ప్రకారం, స్వార్థంతో కూడిన ప్రార్థనలు వ్యర్థం. మనం మన సంకుచిత స్వార్థ ప్రయోజనాలకు అతీతంగా ఎదిగి, ఈ లోకంలో జీవం పట్ల దేవుడు కలిగియున్న ఉద్దేశాలను అడ్డుకునే శక్తులను ఎదిరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదేమైనా, యెషయా సమూహ శ్రేయస్సుకు సంబంధించిన ప్రోత్సాహకాలను అందిస్తున్నాడిక్కడ (8-12). ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే — యెషయా కేవలం చెర నుండి తిరిగి వచ్చి, ధర్మశాస్త్రం మరియు దేవాలయ పద్ధతులు, ఆచారాల ప్రకారం దేవుని వైపు తిరిగితే చాలు మళ్లీ దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చని నమ్మిన ప్రజలతో మాట్లాడుతున్నాడు. పేదరికాన్ని అనుభవిస్తున్న ప్రజల పట్ల వారు కలిగి ఉండాల్సిన వైఖరికి సంబంధించి, మరింత తీవ్రమైన అంశాలను ఆలోచించేలా యెషయా వారికి సహాయపడుతున్నాడు. ఏది ఏమైనప్పటికీ, మనం ప్రతిఫలాలను ఆశించి కాకుండా, దేవుని మంచితనానికి కృతజ్ఞతగా మాత్రమే దాతృత్వం మరియు పరోపకారాలు చేద్దాం. జాగ్రత్త! దేవునికి లంచం ఇవ్వలేము. సువార్త పాఠ్యభాగంలో (మత్తయి 5:43-48) యేసు దీనికి మరింత సహాయకరమైన అర్ధాన్ని అందిస్తున్నారు.
